
- 450 ఎకరాల్లో దండుమల్కాపూర్ టీఐఎఫ్-ఎంఎస్ ఎంఈ గ్రీన్
మోడల ఇండస్ట్రియల్ పార్కు అభివ్రద్ధి.
అనుబంధంగా 100 ఎకరాల్లో రెసిడెన్సియల్ టౌన్షిప్
సీఎం కేసీఆర్ ఆలోచనమేరకు.. ఉద్యోగులు, కార్మికుల నివాసం కోసం ఇక్కడే
376 ఎంఎస్ ఎంఈ యూనిట్ల ఏర్పాటు
రూ.1000 కోట్ల పెట్టుబడులు – 12 వేలమందికి ప్రత్యక్షంగా ఉపాధి
-ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్
దండుమల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్కు, టీఎస్ ఐఐసీ ప్రాజెక్టులపై అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష
(హైదరాబాద్ – అక్టోబర్ 07)
దండుమల్కాపూర్ టీఐఎఫ్-గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును మోడల్ హౌసింగ్ టౌన్షిప్గా కూడా అభివ్రద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటగా 450 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ ఇండస్ట్రియల్ పార్కు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమని, అందుకు తగ్గట్టుగా అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. వీలైనంత త్వరగా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు సమగ్ర ప్రణాళిక, రోడ్లు, ఇతర ప్రాథమికమైన మౌలిక వసతులను కల్పిస్తే డిసెంబర్ మొదటి వారంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. శనివారం బషీర్బాగ్ పరిశ్రమల భవన్లోని టీఎస్ ఐఐసీ కార్యాలయంలో యాదాద్రి జిల్లా, చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఎంఎస్ ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు కార్యాచరణ ప్రణాళికపై, ఇతర టీఎస్ ఐఐసీ ప్రాజెక్టులపై అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీఎస్ ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, సీఈ లక్ష్మీకాంత్రెడ్డి,తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు కే సుధీర్రెడ్డి, కాలుష్యనియంత్రణ మండలి సభ్యులు ఎస్వీ రఘు పాల్గోన్నారు. ఈ సందర్భంగా దండుమల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్కుకు భూ సేకరణ, అభివ్రద్ధి పనుల ప్రతిపాదనలను టీఎస్ ఐఐసీ అధికారులను మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. టీఎస్ ఐఐసీ-టీఐఎఫ్ ఆధ్వర్యంలో రూపుదిద్ధుకుంటున్న ఈ ఇండస్ట్రియల్ పార్కు కోసం ఇప్పటివరకు రూ.45 కోట్లు ఖర్చు చేసి 377 ఎకరాలను సేకరించామని, మరో 80 ఎకరాల సేకరణకు రైతులకు నోటీసులు జారీచేయడం జరిగిందని టీఎస్ ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎండీ నర్సింహారెడ్డి వివరించారు. భూమి ధరకే భూమిని టీఐఎఫ్కు కేటాయించడం జరిగిందని, అయితే ఇండస్ట్రియల్ పార్కు నిర్వహణ టీఎస్ ఐఐసీ పర్యవేక్షణలో ఉంటుందని వెల్లడించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో దండుమల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్కు మొదటిదని, దీన్నిసూక్ష్మ.చిన్న.మధ్యతరహా పరిశ్రమల కోసం ప్రత్యేకంగా ఏర్పాటవుతుందన్నారు. కాలుష్య రహిత ఇండస్ట్రియల్ పార్కుగా అభివ్రద్ధి చేసి ఆ కేటగిరి పరిశ్రమలనే ఇక్కడ ఏర్పాటు చేస్తామన్నారు. 400 పరిశ్రమల యూనిట్లను ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా 1000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని, 12 వేలమందికి ప్రత్యక్ష్యంగా, 20 వేలమందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే కొత్త పారిశ్రామికవాడలను ఉద్యోగులు, కార్మికులు అక్కడే నివాసం ఉండేలా సమీపంలోనే రెసిడెన్సియల్ టౌన్షిప్లను అభివ్రద్ధి చేయాలన్నది సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆలోచలకు అనుగూనంగానే దండుమల్కాపూర్ పారిశ్రామికవాడను పారిశ్రామికంగానే కాకుండా రెసిడెన్సియల్ మోడల్ టౌన్షిప్గా తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకోసం ఇక్కడ మరో 100 ఎకరాల్లో 30 వేలమందకి నివాస వసతి ఉండేలా పెద్ద ఎత్తున రెసిడెన్సియల్ టౌన్షిప్ను అభివ్రద్ధి చేయడానికి వెంటనే పక్కా ప్రణాళికలు రూపొందించాలని టీఎస్ ఐఐసీ అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఈ టౌన్షిప్ను మున్సిపాలిటీగా అభివ్రద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పారు. అలాగే మరో 25 ఎకరాల్లో పాఠశాల, అంగన్వాడి కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆటస్థలం, కమ్యూనిటీ కేంద్రాల ఏర్పాటుకు టీఎస్ ఐఐసీ తరపున ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. విజయాడ జాతీయ రహదారి నుంచి దండుమల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్కు వరకు ఫార్మేషన్ రోడ్డును రూ.15 కోట్లతో, రూ.5 కోట్లతో విద్యుత్, రూ.5 కోట్లతో నీటి వసతులను కల్పించేందుకు రూ.25 కోట్ల టీఎస్ ఐఐసీ నిధులతో త్వరలో పనులు ప్రారంభించడం జరుగుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇండస్ట్రియల్ పార్కులో అంతర్గత అభివ్రద్ధి పనులు, మౌలికవసతులను టీఐఎఫ్ నిధులతో చేపట్టడం జరుగుతుందని, అయితే, తాజా టెక్నాలజీకి అనుగూనంగా నాణ్యతా ప్రమాణాలతో అభివ్రద్ధి చేయాలని మంత్రి కేటీఆర్ టీఐఎఫ్ అధ్యక్షుడు సుధీర్రెడ్డిని ఆదేశించారు. పరిశ్రమల యూనిట్లకు నిబంధనల మేరకు పారిశ్రామికవేత్తలకు ప్లాట్లు కేటాయించాలని, ఈ వ్యవహారంలో పారదర్శకమైన విధానాన్ని రూపొందించాలని టీఎస్ ఐఐసీ ఎండీని ఆదేశించారు. దండుమల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్కు భూ వినియోగ మార్పిడి, లైఅవుట్కు సంబంధించిన అనుమతులను త్వరితగతిన ఇవ్వాలని హెచ్ ఎండీఏ అధికారులను ఆదేశించారు. ఎంఎస్ ఎంఈ యూనిట్లకు పెండింగ్లో ఉన్న సబ్సిడీలను త్వరలో మంజూరు చేస్తామని పేర్కొన్నారు. పాశమైలారం ఇండస్ట్రియల్ పార్కులో రూ.2 కోట్లతో మౌలిక వసతులు సిద్ధంగా ఉన్నాయని, ప్రారంభించడానికి, సిబ్బంది నియామకానికి ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతులు ఇప్పిస్తామని టీఐఎఫ్ ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.