
హైదరాబాద్, ప్రతినిధి : నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం పనులు జెట్ స్పీడ్తో సాగుతున్నాయి. ఇప్పటికే ల్యాండ్ పూలింగ్తో బిజీబిజీగా ఉన్న బాబు టీమ్… కేపిటల్ కన్స్ట్రక్షన్పై దృష్టిసారించింది. దీంతో ఏపీ రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించడానికి సింగపూర్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. జవనరి 11న సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సహా ప్రతినిధుల బృందం హైదరాబాద్ రానుంది. 12న ఏపీ ఉన్నతాధికారులతో సమావేశం జరగనుంది. 13న ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి రాజధాని ప్రాంతంలో క్షేత్రస్థాయి పర్యటన చేయనుంది.
సింగపూర్ టీమ్ ఏరియల్ సర్వే
ఇప్పటికే రాజధాని నిర్మాణానికి సంబంధించిన ప్రాంతాన్ని సింగపూర్ టీమ్ ఏరియల్ సర్వే నిర్వహించింది. ఆరు నెలల్లో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని ప్రకటించింది. సీఆర్ డిఎ చట్టం రావడం, ల్యాండ్ పూలింగ్ ప్రారంభం కావడంతో తమ పనులు చకచక మొదలు పెట్టాలని ఈశ్వరన్ బృందం భావిస్తోంది. దీంతో రాజధాని నిర్మాణంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి..? అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది..? అనే విషయాలపై సింగపూర్ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నారు.
ఈశ్వరన్ టీమ్ బేస్ క్యాంపుల ఏర్పాటు
రాజధాని నిర్మాణంలో భాగంగా హైదరాబాద్, విజయవాడ, తుళ్లూరులో ఈశ్వరన్ టీమ్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేసుకోనుంది. మార్చినాటికల్లా మాస్టర్ ప్లాన్ కూడా అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించనుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి అవసరమైన యంత్రాంగాన్నంతా బదిలీ చేసింది. దీంతో సింగపూర్ బృందంతో కలిసి పనిచేయడానికి ఏపీ అధికారులు సిద్ధమవుతున్నారు. మరి బాబుగారి డ్రీమ్ కేపిటల్ ఎలా ఉంటుందో చూడాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.