
సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు
నల్లగొండ, సూర్యాపేటల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటు
సత్వరమే ఎంసిఐకి ప్రతిపాదనలు
హెల్త్ వర్సిటీ వీసీ, అధికారులను ఆదేశించిన వైద్య మంత్రి లక్ష్మారెడ్డి
హైదరాబాద్: సూర్యాపేట, నల్లగొండల్లో వైద్య విద్య కళాశాల ఏర్పాటుకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి, ఎంసిఐకి పంపించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కరుణాకర్రెడ్డి, మిగతా అధికారులను ఆదేశించారు. సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు సత్వరమే ఎంసిఐకి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. మెడికల్ కాలేజీల ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ఆజ్ఞాపించారు.
సూర్యాపేట పర్యటనలో భాగంగా సీఎం కెసిఆర్ నల్లగొండ, సూర్యాపేటల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డితో సీఎం మాట్లాడి తగు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో మంత్రి లక్ష్మారెడ్డి వెంటనే సంబంధిత అధికారులతో సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. నల్లగొండ, సూర్యాపేటల్లో హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని వీసి కరుణాకర్రెడ్డిని ఆదేశించారు. వెంటనే తగు ప్రతిపాదనలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి పంపించాలన్నారు. స్థలం, తగు ఏర్పాట్లు, అవసరమైన పత్రాలు ఎంసిఐకి చేరేలా చూడాలన్నారు. అలాగే వీసికి మిగతా అధికారులను సహకరించాలని ఆదేశించారు. సాధ్యమైనంత వేగంగా ఆయా చోట్ల మెడికల్ కాలేజీల ఏర్పాటు జరిగే విధంగా చర్యలు ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు.
అలాగే ఇప్పటి వరకు ప్రగతిలో ఉన్న వైద్యశాలల భవనాలు, కొత్తగా నిర్మించ తలపెట్టిన భవన నిర్మాణాలు, పరికరాలు, సదుపాయాల మీద కూడా మంత్రి సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో హెల్త్ వర్సిటీ వీసీతోపాటు నిమ్స్ డైరెక్టర్, ఆరోగ్యశ్రీ సిఇఓ ప్రొఫెసర్ మనోహర్, వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేశ్రెడ్డి, టిఎస్ఎంఎస్ఐడిసి ఎండి వేణుగోపాపాల్, చీఫ్ ఇంజనీర్ లక్ష్మణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.