
ముషీరాబాద్ నియోజకవర్గంలో నీటి సరఫరా కోసం ప్రత్యేక ప్రణాళికను సిద్దం చేయాలని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు (హెచ్.ఎం.డబ్ల్యు.ఎస్.ఎస్.బి )అధికారులను రాష్ట్ర హోం మరియు కార్మిక శాఖా మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆదేశించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో బుధవారం నాడు ఏర్పాటు చేసిన సమావేశంలో హెచ్.ఎం.డబ్ల్యు.ఎస్.ఎస్.బి. ఎం.డి. దానకిశోర్ , నియోజకవర్గంలోని కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో వాటర్ వర్క్స్ అవసరాలపై ప్రణాళిక సిద్దం చేస్తే నిధులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. ఈ మేరకు నియోజక వర్గంలో చేపట్టాల్సిన పనులు, అవసరమైన నిధుల కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలన్నారు. అదేవిధంగా స్మశాన వాటికల వద్ద “బోర్ వేల్స్ “ చేయడం ద్వారా నీటి సౌకర్యం కల్పించాలని, చెడిపోయిన మ్యానువల్స్ ను గుర్తించి మార్చాలన్నారు. సమావేశంతో ఎం.డి. దానకిశోర్ మాట్లాడుతూ సాధ్యమైనంత తొందరలో ప్రణాళిక రూపొందిస్తామన్నారు. అత్యవసరమైన పనులను సిబ్బంది వెంటనే ప్రారంభిస్తారని తెలిపారు. కార్పొరేటర్లు వి.శ్రీనివాస రెడ్డి, హేమలత, ముఠా పద్మ , లాస్య నందిత తదితరులు పాల్గొన్నారు.