
కరీంనగర్: మిషన్ కాకతీయ మొదటి విడత పనులను పూర్తి చెయ్యకుండా ఆలస్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారిని బ్లాక్ లిస్టులో ఉంచుతామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేటు సమావేశ మందిరంలో మిషన్ కాకతీయ 1అండ్ 11విడుతల పనులపై సమీక్షించారు. కొంత మంది కాంట్రాక్టర్లు అధికంగా పనులను తీసుకొని పనులను చేయలేక పోతున్నారని అన్నారు. అటువంటి వారి పనులను వేరే కాంట్రాకటర్లకు అప్పగించి పనులను పూర్తి చేయిస్తామని తెలిపారు. త్వరలోనే కాంట్రాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మిషన్ కాకతీయ మొదటి విడతలో 804 పనులను చేపట్టగా 477 పనులు పూర్తి అయినట్లు తెలిపారు. ఇంకా 327 పనులు పూర్తి కావల్సి ఉన్నాయని తెలిపారు. అత్యధికంగా కరీంనగర్ డివిజనల్ పెండింగులో ఉన్నాయని తెలిపారు. అన్ని చెరువుల పూడికతీత పనులను మే 31వ తేది లోపల పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్తగా 20 మంది ఎ.ఇ.లను నియమించినందున పనులు వేగవంతం చేయాలని అన్నారు. కాంట్రాక్టర్లపై వత్తిడిని పెంచి పనులు వేగవంతం చేయాలని అన్నారు. పూర్తి అయిన పనులకు చెల్లింపులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇంతవరకు 80.42 కోట్ల రూపాయలను చెల్లించినట్లు తెలిపారు. హుజురాబాద్, మానకొండూరు ప్రాంతాలలో చెరువు పూడికతీత పనులను వేగవంతం చేయడానికి 50 డి.సి.బి లను ఏర్పాటు చేయాలని జె.సి.బి. అసోసియేషన్ కరీంనగర్ ను కోరారు. మిషన్ కాకతీయ రెండవ విడతలో 1271 చెరువుల పనులను తీసుకొన్నారని తెలిపారు. 1222 చెరువులకు అంచనా వ్యయాలను రూపొందించి సి.ఇ.కి అనుమతి పంపినట్లు తెలిపారు. 1054 చెరువులకు పరిపాలన అనుమతులు లభించాయని తెలిపారు. వాటిలో 1001 చెరువులకు టెండర్లను పిలిచినట్లు తెలిపారు. 866 చెరువులకు కాంట్రాక్టర్లతో ఒప్పందాలు కుదిరినట్లు తెలిపారు. 642 చెరువులలో పనులు మొదలు పెట్టినట్లు తెలిపారు. మిగిలిన చెరువుల పనులను వెంటనే మొదలు పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
మిషన్ కాకతీయలో రైతులు తీసుకోగ మిగిలిన మట్టిని ఇతరులు తీసుకొని వెళ్లవచ్చుః
మిషన్ కాకతీయ చెరువులలో పూడిక తీసిన మట్టిని రైతులు తీసుకొని వెళ్లగా మిగిలిన మట్టిని ఇతరులు తీసుకొని వెళ్లవచ్చునని తెలిపారు. గ్రామ పంచాయితీకి చాలాను ద్వారా చెల్లించి అవసరమున్న వారు తీసుకొని వెళ్లవచ్చునని అన్నారు. ప్రభుత్వం నిర్దారించిన రేటుకు చాలాను చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. మిషన్ కాకతీయలో అవసరమున్న మేరకే చెట్లను తొలగించాలని అన్నారు. ఈ సమావేశంలో ట్త్ర్రెనింగ్ కలెక్టర్ గౌతం, ఇరిగేషన్ ఎస్.ఇ. వెంకటకిృష్ణ, సి.పి.ఓ. సుబ్బారావు, అగ్రికల్చర్ జెడి సుచిత్ర, డి.సి.ఓ. అంబయ్య, డి.టి.సి. వినోద్ కుమార్, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.