
బీసీ బాంధవుడు..కేసీఆర్
సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచనలే.. బీసీలకు వరం
అంతరించిపోతున్న కుల వృత్తులను కాపాడుకుంటాం
బీసీ స్టడీ సర్కిళ్లలో నిరంతరంగా శిక్షణ
స్వయం ఉపాధికి పెద్ద పీట
బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడకండి
పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
25 మంది మెజీషియన్స్కు కిట్స్, సర్టిఫికెట్ల అందజేత
హైదరాబాద్, డిసెంబర్ 14 : బీసీ వర్గాల బాంధవుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అని బీసీ సంక్షేమం, అటవీ శాఖల మంత్రి జోగు రామన్న అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెజీషియన్ కోర్సును పూర్తి చేసిన 25 మంది అభ్యర్థులకు మెజీషియన్ కిట్స్, సర్టిఫికెట్లను మంత్రులు జోగు రామన్న, తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం సచివాలయంలోని డీ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప ఆలోచనలే.. బీసీ వర్గాలకు వరంగా మారాయన్నారు. అంతరించిపోతున్న కుల వృత్తులను కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు అనుగుణంగా కార్యాచరణను రూపొందిస్తున్నారని ఆయన తెలిపారు. అందులో భాగంగా బీసీ యుతను ప్రోత్సహించేందుకు స్వయం ఉపాధి పథకాలను అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. అందులో భాగంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 25 మంది యువకులకు మెజీషియన్ కోర్సులో శిక్షణను కల్పించినట్లు మంత్రి జోగు రామన్న తెలిపారు. నాయీ బ్రాహ్మణ, రజకులకు కలిపి రూ.500 కోట్లు మంజూరు చేశారని, వారి వృత్తిలో మరింత నైపుణ్యాన్ని సాధించేందుకు ప్రత్యేక శిక్షణను ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. బీసీ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేశామన్నారు. పాత 10 జిల్లా కేంద్రాల్లో బీసీ స్టడీ సర్కిళ్లు నోటిఫికెషన్లతో సంబంధం లేకుండా నిరంతరం విద్యార్థులకు శిక్షణను ఇస్తున్నట్లు జోగు రామన్న తెలిపారు. హైదరాబాద్లోని స్టడీ సర్కిల్లో 100 మంది విధ్యార్థులకు సివిల్ సర్వీస్లో శిక్షణను ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. యువతకు స్వయం ఉపాధి అవకాశాలను ఇతోధికంగా కల్పిస్తున్నట్లు మంత్రి జోగు రామన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అశోక్ కుమార్, అదనపు కార్యదర్శి సైదా, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రాజశేఖర్, రజక ఫెడరేషన్ ఎండీ చంద్రశేఖర్, ప్రముఖ మెజీషియన్ సామల వేణు, తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడకండి
పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడవద్దని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విపక్షాలకు సూచించారు. గురువారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సచివాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొన్ని విపక్ష పార్టీలు, కొన్ని సంస్థలు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. తమకే ఉద్యోగం లేని వాళ్లు.. ఉద్యగోలంటూ నిరుద్యోగులను రెచ్చగొట్టడమేమిటనీ..? ఆయన ప్రశ్నించారు. రానున్న రోజుల్లో బీసీ వర్గాల భవిష్యత్ స్వర్ణ యుగంగా మారుతుందన్నారు.