
నగరంలో ఇళ్లు, వాహనాలను కడగడం ద్వారా నీటిని భారీ పరిమాణంలో వృథా చేసేవారిని గుర్తించి భారీ జరిమానాలు విధించాలని జీహెచ్ఎంసీ, జలమండలిలు నిర్ణయించాయి. నేడు ఉదయం జీహెచ్ఎంసీ, జలమండలి ఉన్నతాధికారుల సంయుక్త సమావేశాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ దానకిషోర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగర ప్రజలకు మంచినీటిని అందించేందుకు జలమండలి ద్వారా విద్యుత్ చార్జీల నిమిత్తం రూ. 700 కోట్లు చెల్లిస్తున్నామని, వీటిలో దాదాపు రూ. 200 కోట్ల విలువైన విద్యుత్ బిల్లులకు సరిపడా మొత్తం నీరు వృథాగా పోతున్నాయని వివరించారు. ప్రతిరోజు వృథాగా పోతున్న 50 మిలియన్ గ్యాలన్ల నీరు వృథా అడ్డుకునేందుకు ఇప్పటికే జీహెచ్ఎంసీ, జలమండలి ఆధ్వర్యంలో అనే చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, అయినప్పటికీ పలువురు తమ ఇళ్లను, దుకాణాలను, వాహనాలను కడగడానికి భారీ పరిమాణంలో నీటిని వృథా చేస్తున్నారని, ఇక నుండి ఈ వృథాను సహించేదిలేదని పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు క్షేత్రస్థాయి పర్యటనల సందర్భంగా నీటిని వృథాగా వదిలేవారిని గుర్తించి భారీ ఎత్తున జరిమానాలు విధించాలని ఆదేశించారు. ఈ జరిమానాలకు సంబంధించి వివరాలను రూపొందించి జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో ఆమోదింపజేయాలని కోరారు.
నగర పార్కులకు ఎస్.టి.పిల నీరు గ్రేటర్ హైదరాబాద్లో వ్యర్థ జలాలను శుద్ది చేసేందుకు 20 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉన్నాయని, ఈ ప్లాంట్ల ద్వారా వచ్చే ట్రీట్మెంట్ నీటిని నగరంలోని పార్కులకు ఉపయోగించాలని కమిషనర్ దానకిషోర్ ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం ఉన్న ఎస్.టి.పిల నుండి సమీపంలో ఉన్న పార్కులకు నీటి సరఫరాను అందించేందుకు వెంటనే ప్రత్యేక పైప్లైన్ల నిర్మాణాలను చేపట్టాలని జలమండలి అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ -2020లో ట్రీట్మెంట్ వాటర్ వినియోగానికి ప్రాధాన్యత ఇస్తున్నందున నగరంలో పూర్తిస్థాయిలో ఎస్.టి.పిల ద్వారా శుద్దిచేసిన జలాలను ఉపయోగించుకోవాలని కోరారు.
నగరంలో స్వచ్ఛ భారత్ పార్కుల నిర్మాణం
గ్రేటర్ హైదరాబాద్లో స్వచ్ఛ కార్యక్రమాలపై నగరవాసులను మరింత చైతన్యం చేయడానికి స్వచ్ఛ భారత్ అంశాలను తెలియజేసే కాన్సెప్ట్తో ప్రత్యేకంగా స్వచ్ఛ భారత్ పార్కుల నిర్మాణాలను కొత్తగా చేపట్టనున్నట్టు దానకిషోర్ ప్రకటించారు. స్వచ్ఛ హైదరాబాద్, సాఫ్, షాన్దార్ హైదరాబాద్ తదితర కార్యక్రమాల ద్వారా హైదరాబాద్ నగరంలో ఎన్నో వినూత్న కార్యక్రమాలను జీహెచ్ఎంసీ చేపట్టిందని, ఈ వినూత్న కార్యక్రమాలను కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్ కూడా ప్రత్యేకంగా గుర్తించి దేశ వ్యాప్తంగా అమలుపరుస్తుందని పేర్కొన్నారు. ఈ స్వచ్ఛ భారత్ అంశాలు ప్రతిబింబించేలా స్వచ్ఛ భారత్ పార్కులను రూపొందించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే నగరంలో 46 కొత్త పార్కుల ఏర్పాటుకు మంజూరు చేశామని, ఈ పార్కుల్లో కొన్నింటిని స్వచ్ఛ భారత్ పార్కులుగా ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా జల సంరక్షణ, విజ్ఞానాన్ని తెలియజేసే విధంగా ఏర్పాటు చేసిన వాటర్ థీమ్ పార్కు మాదిరిగా అన్ని జోన్లలో కనీసం ఒకటి ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.
ఆరోగ్య కమిటీల ఏర్పాటు
నగరంలో స్వయం సహాయక బృందాల మహిళలచే ఆరోగ్య కమిటీల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని దానకిషోర్ ఆదేశించారు. సీజనల్ వ్యాధులు, మాత శిశు సంరక్షణ, బస్తీ దావఖానాల పై చైతన్యం తదితర అంశాలను స్థానికులకు తెలియజేసేందుకు ఈ ఆరోగ్య కమిటీలు కీలక పాత్ర వహించాలని సూచించారు. సాఫ్, షాన్దార్ మైదరాబాద్ కార్యక్రమం నిర్వహణపై సంబంధిత కార్పొరేటర్లు, శాసన సభ్యులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్లు శృతిఓజా, సిక్తాపట్నాయక్, అద్వైత్ కుమార్ సింగ్, కెనడి, కృష్ణ, విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, జోనల్ కమిషనర్లు ముషారఫ్ అలీ, శంకరయ్య, ఎస్.శ్రీనివాస్రెడ్డి, బి.శ్రీనివాస్రెడ్డి, సిఇ లు సురేష్, శ్రీధర్, జియాఉద్దీన్, సిసిపి దేవేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.