
ప్రజలకు మంచి సేవలు అందించాలి
వ్యాధుల నివారణ మీద ప్రజలను చైతన్య పరచాలి
సదుపాయాలు పెంచుతున్నా…ప్రబలుతున్నవ్యాధుల పట్ల ఆందోళనగా ఉంది
దేశంలో నెంబర్ వన్గా నిమ్స్ డయాలసిస్
వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన, చైనత్యం పెంచాలి
త్వరలో అవగాహన, చైతన్య సదస్సులు నిర్వహించాలి
నిమ్స్లో 10డయాలసిస్ మిషన్లను ప్రారంభించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి
హైదరాబాద్ః
ఒక వైపు అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి తెస్తూ సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ, మరోవైపు ప్రజలకు అనేక వ్యాధులు సోకుతుండటం ఆందోళనకరంగా ఉందన్నారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి. వైద్య సౌకర్యాల ఏర్పాటులో దేశంలో రాష్ట్రం నెంబర్ వన్ గా ఉందని చెబుతున్నప్పటికీ, మరోవైపు ఎంతో బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి. అయితే డాక్టర్లు, సిబ్బంది వ్యాధుగ్రస్తులకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమేగాకుండా, వ్యాధుల నివారణ చర్యల మీద దృష్టి సారించాలన్నారు. ప్రజలను ప్రివెంటివ్ మెడిసిన్ వైపు మళ్ళించాలని, వారిలో అవగాహన పెంచి చైతన్యం తేవాల్సిన అవసరం ఉందని మంత్రి ఉద్బోధించారు. నిమ్స్లో 10 డయాలసిస్ మిషన్ల కేంద్రాన్ని, బార్ కోడ్తో కొత్తగా కంప్యూటరీకరించిన ఓపీ ఫోల్డర్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం నిమ్స్ కొత్తగా ఏర్పాటు చేసిన వెబ్ పోర్టల్ని మంత్రి ప్రారంభించారు. పేషంట్లను కలిసి వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ, నిమ్స్లో 40 డయాలసిస్ మిషన్లను మంజూరు చేశామన్నారు. అందులో 10 మిషన్లు ప్రస్తుతం ప్రారంభించుకున్నామని చెప్పారు. మరో 30 మిషన్లు కొనుగోలు చేశామన్నారు. అయితే అందులో 10మాత్రమే ఇనష్టాల్ అయ్యాయన్నారు. మిగతా 30 మిషన్లను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. అయితే గతంలో నిమ్స్లో ఉన్న 22 మిషన్లతో కలుపుకుని మొత్తం 65 నుండి 70 మిషన్లు అవుతాయన్నారు. ఇలా ప్రభుత్వ రంగంలో రాష్ట్రంలో నెంబర్ వన్గా, దేశంలో మొదటి రెండు మూడు స్థానాల్లో నిలిచే విధంగా నిమ్స్లో డయాలసిస్ ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి. ఇప్పటికే వెయ్యి కిడ్నీ మార్పిడులు జరగగా, ప్రతి నెలా 13 నుంచి 15 కిడ్నీ మార్పిడులు జరుపుతున్నారని తెలిపారు. ప్రతి ఏడాది ఎంసిఐ నిమ్స్కి 8 మంది నెఫ్రాలజీ స్టూడెంట్స్ని కూడా ఇస్తున్నదని వివరించారు. అలాగే రాష్ట్రంలో సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు 40 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దేశంలోనే మొదటిసారిగా సింగిల్ యూజ్డ్ డయాలసిస్ పద్ధతిని ప్రవేశ పెట్టామన్నారు. ఇప్పటికే సిద్దిపేటలో ప్రారంభించిన సింగిల్ యూజ్డ్ డయాలసిస్ కేంద్రానికి మంచి స్పందన వచ్చిందని, ఈ విషయాన్ని మంత్రి హరీశ్రావు తమ దృష్టికి తెచ్చారని చెప్పారు.
ఇదంతా చెప్పుకోవడానికి, ఎంతో చేశామనడానికి బాగానే ఉన్నా, మనసులో మాత్రం చెప్పలేని బాధ ఉందన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. ఇవన్నీ రోగుల కోసం చేస్తున్న సదుపాయాలే అయినప్పటికీ, ఇంత మంది రోగులు పెరుగుతుండటం కూడా ఆందోళనకరమేన్నారు మంత్రి. ఆయా వ్యాధులు రావడానికి కారణాలేంటి? రాకుండా ఏం చేయాలి? ఎలా అదుపు చేయాలి? వ్యాధులని ప్రాథమిక స్థాయిలోనే ఎలా గుర్తించాలి? చికిత్స ఎలా ఎక్కడ చేయించుకోవాలి? వంటి అంశాల మీద ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇంత పెద్ద స్థాయిలో ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తున్నదని, ఈ స్థాయి వైద్యం అవసరం లేని సమాజం కావాలన్నారు. అందుకు ప్రధానంగా డాక్టర్లు, సిబ్బంది, మీడియా తగు రీతిలో ప్రజల్లో చైతన్యం పెంచడానికి కృషి చేయాలన్నారు. త్వరలోనే రాష్ట్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు ప్రబలుతున్న ఆయా వ్యాధులు వాటి నివారణ, రాకుండా మందస్తు జాగ్రత్తలు వంటి అంశాల మీద సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. అందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అలాగే నిమ్స్లోనేగాక, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైద్యశాలల్లో వివిధ విభాగాల వారీగా అభివృద్ధి చేస్తున్నామని, అధునాతన పరికరాలను అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి లక్ష్మారెడ్డి వివరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డితోపాటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీ, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్, సూపరింటెండెంట్ సత్యనారాయణ, నెఫ్రాలజీ విభాగం డాక్టర్లు భూషన్, రాజు, గంగాధర్, స్వర్ణలత, వివిధ విభాగాల డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.