
పంచాయతీ వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం
మిషన్ భగీరథ, నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పంచాయతీలకు ఖర్చు తగ్గుతుంది
డెబ్బై ఏళ్లలో జరుగని పనులను మూడేళ్లలో చేపట్టాం
దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణా మారింది
పంచాయతీలను కూడా దేశంలోనే ఆదర్శంగా మారుద్దాం
ప్రజలంతా భాగస్వామ్యం అయితే ఏదైనా సాధ్యమే
త్వరలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో సర్పంచ్ల సమ్మేళనాలు
టి–సిపార్డ్లో జరిగిన సర్పంచ్ల సమ్మేళన సన్నాహక సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్-తెలంగాణాలో పంచాయతీలను మరింత పటిష్టం చేస్తున్నామని… మిషన్ భగీరథ, నాణ్యమైన విద్యుత్ సరఫరా కారణంగా పంచాయతీలు చేసే ఖర్చు గణనీయంగా తగ్గుతుందని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాజేంద్రనగర్ లోని టి–సిపార్డ్ (telangana state institute of Panchayat raj and rural development) లో సర్పంచుల సమ్మేళనం సన్నాహక సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ… పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని… పంచాయతీలను మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు పోతున్నామన్నారు. పంచాయతీ ల వ్యయ భారాన్ని తగ్గించి, ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మిషన్ భగీరథ, విద్యుత్ కోతలు లేకపోవడం ద్వారా పంచాయతీల ఖర్చు చాలా వరకు తగ్గనుందని, ప్రతి గ్రామంలోనూ సీ సీ రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వమే పెద్ద ఎత్తున చేపడుతుందన్నారు. హైదరాబాద్ మినహా తెలంగాణలోని 30 జిల్లాలను 3 రీజియన్ లుగా విభజించి, రీజియన్ కు ఒక సర్పంచ్ సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. పంచాయతీలను ఆదర్శంగా మార్చడమే లక్ష్యంగా సర్పంచుల అనుభవాలను పంచుకునే వేధికలుగా సిపార్టు ఆధ్వర్యంలో ఈ సమ్మేళనాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లవుతున్నా గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేకపోయాయని… ఇప్పటికీ ఇంటింటికి మరుగు దొడ్డి లేని పరిస్థితి ఉందన్నారు. ఇంకా చాలా గ్రామాలకు మంచి నీరు, రహదారి సౌకర్యాలు కూడా లేకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటిదాక పాలకులు ఓట్లకోసమే ఆలోచించారని, తమ ప్రభుత్వం మాత్రం అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్యంగా కార్యక్రమాలను చేపడుతోందన్నారు. 70 ఏళ్లలో సాధ్యం కాని ఎన్నో కార్యక్రమాలకు మూడేళ్లలోనే రూపకల్పన చేసిన ఘనత సీయం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ప్రజలంతా సంఘటితమై అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేలా సర్పంచులు చూడాలని…అప్పుడే గ్రామ స్వరాజ్యం సాధ్యమన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరికి ప్రభుత్వ పథకాల లబ్ది చేకూరడమే లక్ష్యం గా ముందుకు పోతున్నామని…ఈ ప్రభుత్వం మనందరిదన్నారు మంత్రి జూపల్లి. సర్పంచ్ల సమ్మేళనాల సన్నాహక సమావేశానికి 30 జిల్లాల నుండి 180 మంది సర్పంచ్లతో పాటు… కమిషనర్ నీతూ ప్రసాద్, సెర్ప్ సీ ఈ ఓ పౌసమి బసు, అధికారులు రామారావు, వెస్లీ, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.
మూడు రీజియన్లలో మూడు సన్నాహక సమావేశాలు
రీజియన్ 1 లో భాగంగా ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, కొంరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు సంబంధించిన సర్పంచ్లతో సమ్మేళనం జరుగనుంది. అలాగే రీజియన్ 2 లో జోగులంబ గద్వాల, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్–మల్కాజిగిరి, నాగర్ కర్నూలు, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాల సర్పంచ్లతోనూ… రీజియన్ 3 లో భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, జయశంకర్–భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ (అర్బన్&రూరల్), యాదాద్రి–భువనగిరి జిల్లాల సర్పంచ్లతోనూ సమ్మేళనాలు జరుగుతాయి.
ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష
నాబార్డ్, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాల కింద చేపడుతున్న రోడ్లు, వంతెనల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. సిపార్డ్లో ఇ ఎన్ సీ సత్యనారాయణరెడ్డి తో పాటు సీఈ, ఎస్ ఈ, ఈఈలతో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. అటవీ శాఖ అభ్యంతరాలతో ఆగిన పనులకు సంబంధించి త్వరలోనే అటవీ శాఖ మంత్రి, అధికారులతో సమావేశం కావాలని నిర్ణయించారు.