
మిషన్ కాకతీయ-4టార్గెట్ 5703 చెరువులు.
ఆయకట్టు స్థిరీకరణకు,అదనపు ఆయకట్టుకు ప్రాధాన్యం ఇవ్వాలి.
జనవరి మొదటివారం నుంచి మిషన్ కాకతీయ-4.
నెలాఖరులోగా పాలనామోదం పూర్తి.
టైంటేబుల్ ఖరారు.
పూడిక మట్టికి తప్పనిసరి పరీక్ష.
తెలంగాణలో 2500 సాయిల్ టెస్టు ల్యాబ్ లు.
పూడిక మట్టి పోషకాలపై విస్తృతంగా ప్రచారం.
పది రోజులకోసారి ఎం.కె.పై వీడియో కాన్ఫరెన్స్.
ప్రజల భాగస్వామ్యం పెంచాలి.
మిషన్ కాకతీయ 4 వ దశ కింద 5703 చెరువుల పునరుద్ధరణ చేపట్టనున్నట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు.ఎం.కె లో ప్రజల భాగస్వామ్యాన్ని ఇంకా పెంచాలని మంత్రి కోరారు. ఇకపై పది రోజుల కోసారి మిషన్ కాకతీయ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని చెప్పారు. వివిధ కారణాల వల్ల ఒకసారి తిరస్కరించిన పనులను మరోసారి పంపించే అధికారులపై తీవ్ర చర్యలు ఉంటాయని హరీశ్ రావు హెచ్చరించారు. 4 వ దశ పనులను ప్రారంభించేందుకు సంబంధిత ఎం.ఎల్.ఎ, ఎం.ఎల్.సి,ఇతర ప్రజాప్రతినిధుల టైమ్ ముందుగానే తీసుకోవాలని మంత్రి కోరారు.4 వ దశ కింద తలపెట్టిన 5703 చెరువుల పునరుద్ధరణ పనులకు గాను ఈ నెలాఖరులోగా పరిపాలనాపరమైన అనుమతి పొందాలని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు కోరారు.ఇంత వరకు ప్రభుత్వానికి 2308 పనుల ప్రతిపాదనలు అందాయని తెలిపారు. మంగళవారం ఇక్కడ సెక్రెటేరియట్ లో మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మిషన్ కాకతీయ కింద చేపట్టనున్న పనులలో సంబంధిత సాగునీటి వనరుల ఆయకట్టును స్థిరీకరణకు,అలాగే అదనపు ఆయకట్టుకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. ఎస్.ఈ, ఈ. ఈ.లు క్షేత్ర స్థాయిలో నిరంతరం పర్యటించాలని,పర్యవేక్షించాలని ఆదేశించారు.
4 వ దశ లో చేపట్టనున్న చెరువుల జాబితాను ముందుగానే వ్యవసాయ అధికారులకు అందిస్తున్నందున పూడిక మట్టిని రైతులు వాడుకునే ముందు తప్పనిసరిగా పరీక్షించాలని హరీశ్ రావు ఆదేశించారు. గతంలో తెలంగాణ లో కేవలం భూసార పరీక్ష కేంద్రాలు 9 మాత్రమే ఉండేవని ఇరిగేషన్ మంత్రి చెప్పారు. ఇప్పుడు ప్రతి మూడు గ్రామ పంచాయతీ లకు కలిపి ఒక సాయిల్ టెస్ట్ ల్యాబ్ ఉందన్నారు. మొత్తం 2,500 సాయిల్ టెస్ట్ ల్యాబ్ లున్నట్టు మంత్రి తెలిపారు. పూడికతీత మట్టిలో ఉండే పోషకాలపై ప్రజలు,రైతుల్లో చైతన్యం, అవగాహన తీసుకు రావాలని కోరారు. ఈ మేరకు పూడికతీత మట్టి లోని పోషకాల గురించి గ్రామ పంచాయతీ ల ఎదుట పోస్టర్లు, బ్యానర్ లు ఇతర రకాలుగా ప్రచారం చేయాలని హరీశ్ రావు కోరారు. వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల కింది స్థాయి అధికారులు,సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు.రైతు సమన్వయ సమితులను భాగస్వాములు చేయాలని మంత్రి ఆదేశించారు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న మిషన్ కాకతీయలో ఇంకా సమర్ధంగా పని చేయాలని ఇరిగేషన్ అధికారులను కోరారు. కొందరు సిబ్బంది చేసే తప్పులకు మొత్తం కార్యక్రమం ఆభాసు పాలవుతుందని అన్నారు. మిషన్ కాకతీయ కార్యక్రమంలో ఎక్కడా అవకతవకలు జరగకుండా చూడాలని కోరారు. ఎం.కె.4 లో అలక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.
ఎం.కె. ప్రభావాలపై అధ్యయనం చేసిన ‘నాబ్ కాన్‘సంస్థ పూడిక మట్టి వల్ల రసాయనిక ఎరువుల వాడకం తగ్గినట్లు, వరి, కందులు,పత్తి తదితర పంటల దిగుబడి 2 నుంచి 5 క్వింటాళ్లు పేరిగినట్టు ప్రభుత్వానికి నివేదించినట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు.భూగర్భ జల సంపద కూడా అబూహ్యంగా మిషన్ కాకతీయ నాలుగో దశ పనులను జనవరి మొదటివారంలోనే ప్రారంభించాలని హరీష్ రావు ఆదేశించారు. ఇందుకు సంబంధించిన పాలనాపరమైన అనుమతులు పొందే ప్రక్రియను గత నవంబర్ నుంచే మొదలుపెట్టిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇప్పటికే పరిపాలన పరంగా ఆమోదించిన పనులకు సాంకేతిక అనుమతులిచ్చి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని ఆయన కోరారు.
మిషన్ కాకతీయ నాలుగో దశ టైం లైన్లను విధిగా పాటించాలని ఆయన స్పష్టంచేశారు. డిసెంబర్ 15కల్లా చీఫ్ ఇంజినీర్ కార్యాలయానికి పాలనాపరమైన అనుమతి కోసం అంచనాలు పంపాలని ఆదేశించారు. డిసెంబర్ 31 వరకు పాలనా అనుమతుల ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు మంత్రి తెలిపారు.జనవరి మొదటివారంలో చెరువుల పునరుద్ధరణ పనులు ప్రారంభం కావాలని ఆదేశించారు. మిషన్ కాకతీయ రెండో, మూడో దశలో ప్రారంభించి పూర్తికాకుండా మిగిలిపోయిన చెరువులను కూడా పూర్తిచేసి తుది బిల్లులు చెల్లించాలని ఇంజినీర్లకు సూచించారు. పనుల నాణ్యతపై ఎట్టి పరిస్థితుల్లో రాజీపడొద్దని హెచ్చరించారు. మిషన్ కాకతీయ నాలుగో దశ పునరుద్ధరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు సూచించారు.ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాసరాజ్,వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్ జగన్మోహన్, ‘కాడా‘కమిషనర్ డాక్టర్ మల్సూర్, మైనర్ ఇరిగేషన్ సి.ఈ. లు శ్యామ్ సుందర్,సురేష్, ఇతర సి.ఈ లు లింగరాజు, వెంకటేశ్వర్లు, భగవంతరావు,మంత్రి ఓ.ఎస్.డి.శ్రీధర్ రావు దేశ్పాండే, వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు.