
హైదరాబాద్, ప్రతినిధి : టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆహుతి ప్రసాద్ కన్ను మూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆహుతి, కిమ్స్ హాస్పటల్ లో చికిత్స పొందుతూ మరణించాడు. విక్రం సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ప్రసాద్, 120 కి పైగా సినిమాల్లో యాక్ట్ చేశాడు. రెండు నంది అవార్డులు గెలిచిన ఆహుతి అసలు పేరు అడుసుమిల్లి జనార్దన వర ప్రసాద్. ఆహుతి కి ఒక కొడుకు, కూతురు ఉన్నారు.
కృష్ణా జిల్లా కోడూరులో జన్మించిన ఆహుతి, ‘మా’ ప్రధాన కార్యదర్శిగా పని చేశాడు. విలన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆహుతి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా మెప్పించాడు. గోదావరి యాసతో ప్రేక్షకులను మెప్పించిన ఆహుతి, గులాబి, నిన్నే పెళ్ళాడతా, చందమామ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిద్దు ఫ్రం శ్రీకాకుళం, బెండు అప్పారావ్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆహుతి నటించిన పట్ట పగలు,శంకర, రుద్రమ దేవి సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.
తెలుగు చిత్ర పరిశ్రమ గొప్ప నటున్ని కోల్పోయింది : మోహన్ బాబు
ఆహుతి ప్రసాద్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో చిత్రాల్లో అనేక క్యారక్టర్లకు ప్రాణం పోసిన గొప్పనటుడు, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన శైలిలో నటించి మెప్పించిన ఆయన మరణం తెలుగు చిత్ర సీమకు తీరని లోటని ప్రముఖ నటుడు మోహన్ బాబు విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని.. ఆయన మృతికి సంతాపాన్ని తెలియజేస్తున్నాని మోహన్ బాబు ప్రకటనలో పేర్కొన్నారు.